నెలకు 8 వేల జీతానికి పనిచేసే మహిళకు 13 కోట్ల జీఎస్టీ బకాయి నోటీసులు

  • శాలరీ అకౌంట్ ను ఫ్రీజ్ చేసిన బ్యాంకు అధికారులు
  • జీతం డబ్బులు విత్ డ్రా కోసం వెళితే బయటపడ్డ అసలు విషయం
  • తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో ఘటన
నెలకు రూ.8 వేల జీతానికి పనిచేసే ఓ మహిళకు రూ.13 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు రావడం తమిళనాడులో కలకలం రేపింది. చిరుద్యోగినైన తనకు జీఎస్టీ నోటీసులు రావడం.. అదికూడా ఏకంగా 13 కోట్లు కట్టాలని అందులో పేర్కొనడంతో సదరు మహిళ నివ్వెరపోయింది. జీతం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లినపుడు ఈ విషయం బయటపడింది. తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

వెల్లూర్ జిల్లాలోని గుడియతమ్ ఏరియాలోని నగల్ ప్రాంతానికి చెందిన మహాలింగం కార్ డ్రైవర్.. ఆయన భార్య యశోద ప్రైవేట్ షూ కంపెనీలో పనిచేస్తోంది. షూ కంపెనీ నుంచి నెలకు రూ.8 వేలు జీతంగా అందుకుంటోంది. ఇటీవల జీతం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా.. ఆమె ఖాతా ఫ్రీజ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. యశోద జీఎస్టీ బకాయిపడిందని తేలింది. నెల జీతానికి పనిచేసే తాను జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించగా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

యశోద పేరుమీద రూ.13 కోట్ల జీఎస్టీ బకాయి ఉందని మాత్రమే రికార్డుల్లో ఉందని వివరించారు. చెన్నైలోని జీఎస్టీ ఆఫీస్ కు వెళ్లాలని సూచించారు. అయితే, అక్కడికి వెళ్లినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని, బ్యాంకు ఖాతా పునరుద్ధరించలేదని యశోద వాపోయారు. నెల జీతం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నట్లు తెలిపారు. కాగా, యశోద సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు.

GST notice
Tamil Nadu
Vellore district
Tax Evasion
Income Tax
Shoe company
Government
Chennai GST office
Yashoda

More Telugu News